మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా[2][3] (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ [4] పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
మాల్కం ముగ్గేరిడ్జ్(Malcolm Muggeridge) చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ (Something beautiful for God) అనే పుస్తకం, డాక్యుమెంటరీ ద్వారా 1970 ల నాటికి మానవతా వాదిగా, పేద ప్రజలు, నిస్సహాయుల అనుకూలురాలిగా అంతర్జాతీయ కీర్తి పొందింది. ఈమె తన మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందింది. మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్ (HIV/AIDS), కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించింది.
ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నది. ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం, మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు. అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి. విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల కూడా వ్యాకులత వ్యక్తమైంది.[5] ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ II చే దైవ ఆశీర్వాదం (బీటిఫికేషన్), బ్లెస్డ్ థెరెసా ఆఫ్ కలకత్తా బిరుదు పొందింది.
Post a Comment